Stock Market: స్టాక్ మార్కెట్: భారీ నష్టాల నుంచి పుంజుకుని.. చివరికి స్వల్ప లాభాలలో ముగింపు

  • నష్టాలలో మొదలైన నేటి ట్రేడింగ్ 
  • సెన్సెక్స్ 600 పాయింట్లు రికవర్
  • భారీ నష్టాలలో అదానీ గ్రూపు షేర్లు
Stock Markets closed in green

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో నేటి ట్రేడింగ్ నష్టాలలోనే మొదలైంది. ఒకానొక దశలో సెన్సెక్స్ సుమారు 600 పాయింట్ల వరకు పడిపోయింది. అయితే, మధ్యాహ్నం తర్వాత కోలుకుని, రికవర్ అవడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి.

దీంతో 76.77 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52551.53 వద్ద.. 12.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15811.85 వద్ద ముగిశాయి. గత కొన్నాళ్లుగా జోరు మీదున్న అదానీ గ్రూపు షేర్లు నేడు భారీగా పతనమయ్యాయి. ఎన్ఎస్డీఎల్ ఖాతాల స్తంభన వార్తలతో ఈ షేర్లు భారీగా నష్టాలపాలయ్యాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్ షేర్లు సుమారు పది శాతం వరకు నష్టపోవడం గమనార్హం.

ఇక నేటి సెషన్లో ఇండియా బుల్స్ హౌసింగ్, పీఎన్బీ, ముతూట్ ఫైనాన్స్, అమరరాజా బ్యాటరీ, రిలయన్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, నెస్లే తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, లుపిన్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, మారుతి సుజుకి తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.      

More Telugu News