Dharmendra Pradhan: పెట్రో ధరలు సమస్యగానే ఉన్నాయి... దీన్ని మేం అంగీకరిస్తున్నాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

  • అడ్డుఅదుపులేకుండా పెరుగుతున్న పెట్రో ధరలు
  • మే 4 నుంచి 23 సార్లు పెరిగిన వైనం
  • వివరణ ఇచ్చిన పెట్రోలియం మంత్రి
  • సంక్షేమ పథకాలకు నిధులు ఆదా చేస్తున్నామని వెల్లడి
Union minister Dharmendra Pradhan said they accepts petro prices are a problem

దేశంలో చమురు ధరలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడకపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు సమస్యగానే ఉన్నాయని, దీన్ని తాము అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలపై పెట్రో ధరల భారం అర్థం చేసుకోగలమని అన్నారు. మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో, ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు.

పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణం, సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయాల్సి రావడమేనని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ల కోసమే రూ.35,000 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వేళ నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. చమురు ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చమురు ధరలు తగ్గించాలని అక్కడి సీఎంలను కోరాలని డిమాండ్ చేశారు.

More Telugu News