China: 'జీ-7'ను చిన్న గ్రూపుగా అభివ‌ర్ణిస్తూ చైనా వ్యాఖ్య‌లు

  • ఇటువంటి చిన్న‌పాటి గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు కావు 
  • అన్ని దేశాలు స‌మాన‌మే అని మేము భావిస్తాం
  • అన్ని దేశాల సంప్ర‌దింపుల‌తోనే ప్ర‌పంచ వ్య‌వ‌హారాలు జ‌ర‌గాలి  
china on g7

బ్రిట‌న్ వేదిక‌గా జీ-7 శిఖరాగ్ర సదస్సు కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో జీ-7 సభ్య దేశాలతో పాటు మ‌రికొన్ని దేశాల అధినేతలు పాల్గొని ప్ర‌సంగిస్తున్నారు. నిన్న క‌రోనా పుట్టుక గురించి, దానిపై ప‌రిశోధ‌న చేయాల్సిన అవ‌స‌రం గురించి కూడా చ‌ర్చించారు. జీ-7 దేశాల స‌ద‌స్సు నేప‌థ్యంలో చైనా వాటిని విమ‌ర్శిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

జీ-7ను చిన్న గ్రూపుగా అభివ‌ర్ణిస్తూ ప్ర‌పంచాన్ని ఇటువంటి చిన్న‌పాటి గ్రూపులు శాసించే రోజులు ఎప్పుడో పోయాయని చెప్పుకొచ్చింది. అన్ని దేశాలు స‌మాన‌మే అని తాము ఎప్పుడూ విశ్వ‌సిస్తామని, అన్ని దేశాల సంప్ర‌దింపుల‌తోనే ప్ర‌పంచ వ్య‌వ‌హారాల‌ను నిర్వ‌హించాలని లండ‌న్‌లోని చైనా ఎంబ‌సీ అధికార ప్ర‌తినిధి ఒక‌రు వ్యాఖ్యానించారు.
 
కాగా, చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళిక‌ల‌పై అమెరికా, బ్రిట‌న్‌, కెన‌డా, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఫ్రాన్స్‌, జ‌పాన్ దేశాలు చ‌ర్చిస్తున్నాయి. ఈ ఏడు దేశాలు ప్ర‌పంచంలోనే ధ‌నిక‌వంత‌మైన ప్ర‌జాస్వామ్య దేశాలుగా పేరు తెచ్చుకున్నాయి. చైనా నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లాల‌ని  కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఈ స‌మావేశంలో అన్నారు. చైనా చేప‌ట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌కు ప్ర‌త్యామ్నాయంగా అభివృద్ధి చెందిన దేశాలు మ‌రో ప్రాజెక్ట్‌ను ప్రారంభించాల‌ని జీ-7 దేశాలు భావిస్తున్నాయి.  

More Telugu News