Revanth Reddy: మోదీ, కేసీఆర్ లపై రేవంత్ రెడ్డి విసుర్లు

  • కరోనా సంక్షోభ సమయంలో కూడా పెట్రో ధరలను పెంచుతున్నారు
  • ప్రజల నడ్డిని మోదీ, కేసీఆర్ విరుస్తున్నారు
  • అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చింది
Modi and KCR robbing in the name of petro says Revanth Reddy

ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ ఇద్దరూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇద్దరూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని... అయితే, ఇలాంటి సమయంలో కూడా గత 10 నెలల కాలంలో పెట్రోల్, డీజిల్ పై రూ. 25 వరకు ధర పెంచారని అన్నారు.

సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు... జనాలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. మోదీ పాలనలో అచ్చేదిన్ రాలేదని, సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. రూ. 35కి అమ్మాల్సిన పెట్రోల్ ను రూ. 100కి అమ్ముతున్నారని... ఇందులో మోదీ రూ. 33, కేసీఆర్ రూ. 32 పన్నుల పేరిట వసూలు చేస్తున్నారని అన్నారు. పెట్రో ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయాయని చెప్పారు.

More Telugu News