Mehul Choksi: వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీని ఎలా ట్రాప్ చేశారంటే...!

  • పీఎన్బీ స్కాంలో చోక్సీపై తీవ్ర ఆరోపణలు
  • దేశం విడిచి పారిపోయిన చోక్సీ
  • రెండేళ్లుగా కరీబియన్ దీవుల్లో నివాసం
  • అనూహ్యరీతిలో డొమినికా పోలీసులకు చిక్కిన వైనం
How Mehul Choksi was trapped by

పీఎన్బీ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికా దేశ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ బ్రిటన్ పారిపోగా, ఆయన మేనమామ అయిన మేహుల్ చోక్సీ వెస్టిండీస్ దీవులకు పరారయ్యాడు.

గత రెండేళ్లుగా కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బార్బుడాలో తలదాచుకుంటున్న చోక్సీ... ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో డొమినికా పోలీసులకు పట్టుబడ్డాడు. మే 23 తర్వాత ఆయన ఆంటిగ్వా నుంచి అదృశ్యమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన న్యాయవాది జస్టిన్ సైమన్ కొన్ని అంశాలను మీడియాతో పంచుకున్నారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.... "ఇక్కడి జోలీ హార్బర్ నుంచి ఆయనను కొందరు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. బార్బరా జబారికా అనే మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకున్న చోక్సీని అపహరించారు. బార్బరా గత 3 నెలలుగా ఆంటిగ్వాలో ఉంటోంది. ఇద్దరు పక్క పక్క ఇళ్లలోనే ఉంటుండడంతో, చోక్సీ ఎప్పుడు వాకింగ్ కు వెళ్లినా ఆమె కూడా వెంట కనిపించేది. పరిచయం ఏర్పడడంతో ఆమె చోక్సిని తన నివాసానికి ఆహ్వానించింది.

అయితే, చోక్సీ వెళ్లగానే, ఆరుగురు దుండగులు చుట్టుముట్టారు. వారిలో కొందరు ఆంటిగ్వా యాసలో, మరికొందరు భారతీయ భాషలో మాట్లడారు. ఆపై వారు చోక్సీని బాగా కొట్టారు, కరెంటు షాకులు కూడా ఇచ్చారు. తలకు ముసుగు వేసి ఓ బోటులో డొమినికా చేర్చారు. చోక్సీ బోటులో వెళుతున్న విషయం గుర్తించారు కానీ, ఎటు వైపు వెళుతున్నదీ గమనించలేకపోయారు. అనంతరం అతడ్ని ఓ కోస్టుగార్డు బోటులోకి మార్చారు. అక్కడే చోక్సీని డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు.

చోక్సీని తరలించిన బోటులో మిస్టరీ మహిళ కూడా ఉందా? అనే విషయం చెప్పలేం. చోక్సీ ముఖానికి ముసుగు ఉండడంతో ఏం చూడలేకపోయారు. మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చూస్తే ఆమె కూడా బోటులో ఉన్నట్టు తెలుస్తోంది. నాకు తెలిసినంతవరకు ఆమె ఆంటిగ్వాకు చెందిన ఆమె కాదు. ఆమె ఇంగ్లండ్ కు  చెందిన మహిళ అని భావిస్తున్నాను. అంతేకాదు, ఆమె భారతీయురాలిగా అనిపిస్తోంది. కానీ ఆమె పేరు మాత్రం భారతీయ మూలాలకు చెందినది కాదు. ఈ వ్యవహారం మొత్తం... చోక్సీని భారత్ కు అప్పగించడానికి జరిగినట్టుగా భావిస్తున్నాం" అని వివరించారు.

More Telugu News