KCR: భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కార్యాచణ చేపట్టాం: కేసీఆర్

  • నాసిరకం ప్లాస్టిక్ పై నియంత్రణ విధించాం
  • హరితహారం పనులను పటిష్ఠంగా అమలు చేస్తున్నాం
  • రాష్ట్రంలో తాగు, సాగు నీరు పుష్కలంగా లభిస్తోంది
KCR comments on environment

పర్యావరణానికి మించిన సంపద లేదనే విషయం ఈ కరోనా సమయంలో మరోసారి రుజువయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఎదుర్కొనే దుర్భర పరిస్థితులను కేవలం పర్యావరణ పరిరక్షణ ద్వారానే ఎదుర్కోగలమని చెప్పారు. భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాచరణను చేపట్టిందని తెలిపారు.

నాసిరకం ప్లాస్టిక్ వినియోగంపై తమ ప్రభుత్వం నియంత్రణ విధించిందని కేసీఆర్ చెప్పారు. గ్రీన్ కవర్ పెంచేందుకు హరితహారం వంటి పలు పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నాయని... జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయని చెప్పారు.

తమ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా తాగునీరు, సాగునీరు లభిస్తోందని కేసీఆర్ అన్నారు. నదీ జలాలను మళ్లించడం ద్వారా అడుగడుగునా పచ్చదనం కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

More Telugu News