rbi: క‌రోనా ఎఫెక్ట్: వృద్ధిరేటు అంచ‌నాల‌ను త‌గ్గించిన ఆర్‌బీఐ

  • జీడీపీ అంచనాలు 9.5 శాతానికి త‌గ్గింపు
  • తొలి త్రైమాసికంలో ఆర్థిక‌ వృద్ధిరేటు 18.5 శాతంగా అంచ‌నా
  • రెపో రేట్లు య‌థాత‌థం
RBI cuts FY22 GDP forecast

ప్ర‌స్తుత‌ ఆర్థిక సంవత్సర (2021-2022) వాస్త‌వ‌ జీడీపీ అంచనాలను 9.5 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పేర్కొంది. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ...  ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఆర్థిక‌ వృద్ధిరేటు 18.5 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు చెప్పారు.

అలాగే, రెండో త్రైమాసికంలో  వృద్ధిరేటు 7.9గా, మూడో త్రైమాసికంలో 7.2గా, నాలుగో త్రైమాసికంలో 6.6గా ఉంటుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు తెలిపారు. దేశంలో రెండోద‌శ‌ క‌రోనా విజృంభణ కార‌ణంగా విధించిన ఆంక్ష‌ల ప్ర‌భావం ఆర్థిక కార్య‌క‌లాపాల‌పై కొన‌సాగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.
 
ఆర్‌బీఐ ఇంత‌కు ముందు ఈ ఆర్థిక సంవ‌త్స‌ర జీడీపీ 10.5గా ఉంటుంద‌ని అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. అలాగే, తొలి త్రైమాసికంలో 26.2, రెండో త్రైమాసికంలో 8.3, మూడో త్రైమాసికంలో 5.4, నాలుగో త్రైమాసికంలో 6.2గా వృద్ధిరేటు ఉంటుంద‌ని అప్ప‌ట్లో అంచ‌నా వేసింది.

అయితే, క‌రోనా మ‌ళ్లీ విజృంభించ‌డం వంటి కార‌ణాల‌తో అంచ‌నాల‌ను స‌వ‌రించి, త‌గ్గించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌ర ద్ర‌వ్యోల్బ‌ణం 5.1 శాతంగా ఉంటుంద‌ని ఆర్‌బీఐ అంచ‌నా వేసింది. కాగా, రెపో రేట్ల‌లో ఆర్‌బీఐ ఎటువంటి మార్పులూ చేయ‌కుండా య‌థాత‌థంగా ఉంచింది. దీంతో గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగా రెపో రేటు 4 శాతంగా, రివ‌ర్స్ రెపో రేటు 3.35గా ఉంది.

More Telugu News