Palla Rajeshwar Reddy: ఈటల వ్యాఖ్యలు క్షమించరానివి.. కేసీఆర్ చర్యలు తీసుకుంటారు: ఎమ్మెల్సీ పల్లా

  • ఈటలను కేసీఆర్ ఎంతో గౌరవించారు
  • పదవి లేకుండా ఆయన ఎప్పుడూ లేరు
  • ఈటల ఆయన సమాధిని ఆయనే కట్టుకున్నారు
KCR will take action on Etela says MLC Palla Rajeshwar Reddy

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి సర్వం సిద్ధమైంది. మూడు, నాలుగు రోజుల వ్యవధిలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. మరోవైపు, ఈటలపై టీఆర్ఎస్ నేతల విమర్శలు పదునెక్కుతున్నాయి.

తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈటలపై మండిపడ్డారు. గత 20 ఏళ్ల కాలంలో తమ అధినేత కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని... వారిలో ఈటల ఒకరని అన్నారు. ఈటలలో ఉన్న కమ్యూనిజం భావజాలన ఎక్కడకు పోయిందని.... బీజేపీ నాయకులకు తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. ఈటల మాట్లాడుతున్న మాటలకు ప్రజలంతా ఛీ కొడుతున్నారని అన్నారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి చట్ట విరుద్ధమైన పనులను ఈటల ఎలా చేశారని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను తీసుకున్న ఈటలకు ఆత్మగౌరవం ఎక్కడుందని నిలదీశారు.

ఈటలను గౌరవించినంతగా మరే నేతను కేసీఆర్ గౌరవించలేదని చెప్పారు. టీఆర్ఎస్ లో ఎక్కువ పదవులను ఈటల అనుభవించారని... పదవి లేకుండా ఆయన ఎప్పుడూ లేరని అన్నారు. పార్టీ అధినేతపై నమ్మకం లేదని అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని మండిపడ్డారు. ఈటల చేసిన పనికి ఆయనపై పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని... సమయాన్ని చూసుకుని కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 'ఈటలా... నీ సమాధిని నువ్వే కట్టుకున్నావ్' అని పల్లా  వ్యాఖ్యానించారు.

More Telugu News