China: చైనా ప్రయోగశాలలోనే కరోనా వైరస్ పుట్టింది... యూరప్ పరిశోధకుల వెల్లడి!

  • చైనాలో వెల్లడైన కరోనా ఉనికి
  • జంతువుల నుంచి వ్యాపించిందంటున్న చైనా
  • వుహాన్ ల్యాబ్ నుంచే అని అమెరికా ఆరోపణలు
  • తాజాగా బ్రిటీష్, నార్వే పరిశోధకుల ఆసక్తికర అధ్యయనం
Latest study says corona virus was made in China

మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మూలాలు ఎక్కడన్న విషయంలో ఇప్పటికీ ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. చైనాలో ఈ వైరస్ ఉనికి బయటపడినా, అది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కానీ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో ఉత్పన్నం అయిందని అగ్రరాజ్యం అమెరికా గతంలోనే ఆరోపించింది. అనేక దేశాలు అమెరికా వాదనను బలపరిచాయి. ఈ నేపథ్యంలో వుహాన్ లో పర్యటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం కూడా ఏమీ తేల్చలేకపోయింది. తాజాగా యూరప్ కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు సంచలన ఆరోపణలు చేశారు.

కరోనా వైరస్ ప్రయోగశాలలో తయారైనదేనని, అది గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించింది అని నమ్మించేలా రివర్స్ ఇంజినీరింగ్ కు పాల్పడ్డారని బ్రిటన్, నార్వే దేశాలకు చెందిన పరిశోధకులను ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ ఓ కథనం వెలువరించింది. దీనిపై అధ్యయనంలో పాలుపంచుకున్న బ్రిటన్ ఫ్రొఫెసర్ ఆంగస్ డాల్ గ్లిష్, నార్వే పరిశోధకుడు డాక్టర్ బిర్గర్ సోరెన్సన్ (బయోవాక్-19 కరోనా వ్యాక్సిన్ రూపకర్త) కరోనా వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారనడానికి తమ వద్ద నికార్సయిన ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

కరోనా వైరస్ జన్యుపటాన్ని పరిశీలిస్తే... ధనావేశం కలిగిన 4 అమైనో ఆమ్లాలు ఒకే వరుసలో ఉన్నాయని, కృత్రిమంగా రూపొందించారనడానికి ఇదే రుజువు అని వారు పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రకృతి సిద్ధంగా పుట్టుకొచ్చిందన్న వాదనకు బలం చేకూర్చే అంశాలు తమ పరిశోధనలో చాలా తక్కువగా మాత్రమే కనిపించాయని వారు వివరించారు. ఇప్పటికే చైనాలోని వుహాన్ ల్యాబ్ పై అనుమానాలు ఉన్న నేపథ్యంలో, తాజా అధ్యయనం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.

More Telugu News