KTR: బిర్యానీలో మసాలా తక్కువైందన్న నెటిజన్... అందుకు నేనేం చేయగలను బ్రదర్? అంటూ కేటీఆర్ రిప్లయ్

KTR replies to a person who complained him no gravy in biryani
  • జొమాటోకు బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి
  • ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ కోరానన్న నెటిజన్ 
  • అవేవీ లేకుండా బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఫిర్యాదు
  • విస్మయం వ్యక్తం చేసిన కేటీఆర్
సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయం కోరుతూ తనను ట్యాగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా బదులిచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏదైనా కష్టం వచ్చి కేటీఆర్ ను సంప్రదిస్తే ఫర్వాలేదు కానీ, బిర్యానీలో మసాలా తక్కువైందంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో ఆయన విస్మయానికి గురయ్యారు.

తోటకూరి రఘుపతి అనే వ్యక్తి తాను జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశానని తెలిపాడు. ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కావాలని తాను ఆర్డర్ చేస్తే, అవేవీ లేకుండానే తనకు చికెన్ బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఆ వ్యక్తి వాపోయాడు. జొమాటో వాళ్లు ప్రజలకు ఇలాగేనా సేవ చేసేది? అంటూ ఆ వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.

దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. దీనికి నన్నెందుకు ట్యాగ్ చేయడం బ్రదర్? ఈ విషయంలో నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అని ప్రశ్నించారు. నెట్టింట ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి.

అన్నింటికీ మించి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ట్వీట్ పట్ల వ్యాఖ్యానించారు. తన కార్యాలయం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ స్పందించాల్సిందేనని ఒవైసీ చమత్కరించారు.
KTR
Biryani
Gravy
Extra Masala

More Telugu News