Rajasthan: అంత్యక్రియల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి.. షాక్‌లో కుటుంబ సభ్యులు

  • రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో ఘటన
  • వేరొకరి మృతదేహాన్ని తమ వాడిదిగా భావించిన కుటుంబ సభ్యులు
  • మరణించాడనుకున్న కుమారుడు ఇంటికి రావడంతో సంతోషం
Dead man returns home after Rajasthan family performs last rites

అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాకైన ఘటన రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జిల్లాకు చెందిన ఓంకార్‌లాల్ (40) ఈ నెల 11న ఇంట్లో చెప్పకుండా ఉదయ్‌పూర్ వెళ్లాడు.

అక్కడికి వెళ్లాక అనారోగ్యం పాలవడంతో అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.  అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్ ప్రజాపత్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. మూడు రోజులైనా గోవర్ధన్ శవాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

గోవర్ధన్ పొటోలను సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో ప్రచురించిన పోలీసులు గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు. ఇవి చూసిన ఓంకార్‌లాల్ కుటుంబ సభ్యులు మార్చురీకి వెళ్లి శవాన్ని చూసి ఓంకార్‌గా పొరబడ్డారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియులు నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓంకార్‌లాల్ ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడనుకున్న కొడుకు ఇంటికి రావడంతో సంతోషంలో  మునిగిపోయారు.

More Telugu News