Ramulu Naik: ఆనందయ్య మందును ఎక్కువచేసి చెప్పడంలేదు, కించపరచడంలేదు: ఆయుష్ కమిషనర్ రాములు

  • ఆనందయ్య మందుపై ఆయుష్ కమిషనర్ వివరణ
  • మరో ఐదారు రోజుల్లో నివేదిక
  • సీఎం జగన్ తో చర్చించామన్న కమిషనర్
  • చట్టపరంగా ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని వెల్లడి
  • క్లినికల్ ట్రయల్స్ తర్వాతే స్పష్టత వస్తుందని వివరణ
Ayush commissioner Ramulu Naik talks about Ananadaiah medicine

ఆనందయ్య కరోనా ఔషధంపై ఆయుష్ కమిషనర్ రాములు నాయక్ మరింత వివరణ ఇచ్చారు. మందుపై ఐదారు రోజుల్లో నిపుణుల నివేదిక వస్తుందని వెల్లడించారు. నివేదిక పరిశీలించాక ఆనందయ్య ఔషధం కరోనా కట్టడికి పనికి వస్తుందో, లేదో నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఆనందయ్య ఔషధంలో వాడుతున్న మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని తెలిపారు. ఇందులో హానికరమైన పదార్థాలేవీ లేవని పేర్కొన్నారు. ఏ ప్రాసెస్ లో ఎంత మోతాదులో మందు తయారుచేస్తున్నారో తెలియాలని, ఇప్పటికే మందులో వాడిన 18 రకాల మూలికలపై అధ్యయనం చేశామని రాములు నాయక్ చెప్పారు.

ఈ ఔషధంతో స్వస్థత చేకూరిందని ఎక్కువమంది చెబుతున్నారని రాములు వివరించారు. అయితే, దీన్ని చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు. ఆనందయ్య మందును తాము ఎక్కువ చేసి చెప్పడం లేదని, అలాగని కించపరచడం లేదని పేర్కొన్నారు. ఆనందయ్య ఔషధం గురించి సీఎం జగన్ తో చర్చించామని, పరిశోధన త్వరగా పూర్తిచేయాలని చెప్పారని వెల్లడించారు.

ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు.  సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆనందయ్య మందును ఇప్పటివరకు 80 వేల మందికి పంపిణీ చేసినట్టు చెబుతున్నారని, వేల మందిలో ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ఇదేమంత పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. ఆనందయ్య మందు వాడిన 500 మంది డేటా సేకరించామని తెలిపారు.

More Telugu News