China: స‌రిహ‌ద్దుల్లో ఆగ‌ని చైనా దుందుడుకు చ‌ర్య‌లు.. డ్రాగ‌న్ తీరును స్ప‌ష్టం చేస్తోన్న శ్వేత‌ప‌త్రం

  • సైన్యాన్ని త‌ర‌లించి ఇప్ప‌టికే విన్యాసాలు
  • దలైలామా వారసుడి ఎంపిక విషయంపై వాద‌న‌లు
  • తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని వ్యాఖ్య‌లు
  • టిబెట్ అభివృద్ధి పేరిట సైన్యం మోహ‌రింపు
china releases white paper

చైనా మ‌ళ్లీ త‌న‌ బుద్ధిని చూపుతూ భార‌త‌ స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు త‌మ‌ సైన్యాన్ని త‌ర‌లించి విన్యాసాలు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తూర్పు ల‌ఢ‌ఖ్ సెక్టార్‌కు స‌మీపంలో చైనా ఈ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. చైనా తీరును ఇప్ప‌టికే భార‌త్ గుర్తించింది.

తాజాగా చైనా విడుద‌ల చేసిన ఓ శ్వేత‌ప‌త్రం కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా (85) వారసుడి ఎంపిక విషయంపై చైనా ప‌లు వాద‌న‌లు చేస్తోంది. ఈ విష‌యంపైనే చైనా ఓ శ్వేతపత్రం విడుద‌ల చేసింది.

దలైలామా వారసుడు ఎవరైనా స‌రే అందుకు తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని అంటోంది. అలా కాకుండా ఇష్టానుసారం వారసుడిని నియమిస్తే గుర్తించబోమని చెప్పుకొచ్చింది. 17, 18 శతాబ్దాల్లో చైనాను పరిపాలించిన రాజుల కాలం నుంచి బౌద్ధ గురువుల వారసులకు పాలకుల ఆమోదం తప్పనిసరిగా ఉండేదని తెలిపింది. 1951 నుంచి తాము టిబెట్‌, దాని విమోచనం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుప‌డుతున్నామ‌ని చెప్పుకొచ్చింది.

కమ్యూనిస్టు పార్టీ సూచనల మేరకు.. పేదరికంతో అవస్థలు పడుతున్న టిబెట్‌ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పనులకు తాము ప్ర‌తి ఏడాది నిధుల కేటాయింపులు పెంచుతున్నామ‌ని చెప్పింది. చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్  పాల‌న‌లో చైనా సరిహద్దుల అభివృద్ధితో పాటు కొత్త గ్రామాల ఏర్పాటుపై దృష్టి పెట్టారని పేర్కొంది.

హైవేల నిర్మాణం, మూడు  విమానాశ్రయాల నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారని పేర్కొంది. అయితే, హిమాలయ ప్రాంతంలో సరిహద్దులపై పట్టు సాధించాలంటే చైనాకు టిబెట్‌ కీలకం. ఈ ఉద్దేశంతోనే అక్క‌డి గ్రామాల అభివృద్ధి పేరిట చైనా వ్యూహాలు ర‌చిస్తోంది. దాని పేరిటే భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు నేపాల్, భూటాన్‌ భూభాగాలకు చేరువగా వస్తూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్పడుతోంది.

More Telugu News