Narendra Modi: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టిన ప్రధాని మోదీ

  • గుజరాత్ వద్ద తీరం దాటిన తౌతే
  • గుజరాత్, డయ్యూ ప్రాంతాలను పరిశీలించిన మోదీ
  • అధికారులతో కలిసి హెలికాప్టర్ లో విహంగ వీక్షణం
  • తుపాను నష్టం అంచనా
  • రాష్ట్రాలను ఆదుకుంటామని మోదీ భరోసా
PM Modi takes aerial survey to asses Tauktae damage

తౌతే తుపాను సృష్టించిన విధ్వంసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. గుజరాత్, డయ్యూలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన నేడు ఏరియల్ సర్వే చేపట్టారు. ఢిల్లీ నుంచి ఈ ఉదయం భావ్ నగర్ చేరుకున్న మోదీ... ఉనా, డయ్యూ, జాఫరాబాద్ ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచి పరిశీలించారు. గిర్, సోమ్ నాథ్, భావ్ నగర్, అమ్రేలీ జిల్లాతో పాటు డయ్యూలో తౌతే మిగిల్చిన నష్టాన్ని అంచనా వేశారు.

ఈ సందర్భంగా ప్రధాని వెంట అధికారులు కూడా ఉన్నారు. తౌతే తుపాను విధ్వంసం తాలూకు వివరాలను వారు ప్రధానికి తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తుపాను బాధిత రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను పెను తుపానుగా మారి పశ్చిమ తీరాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, డయ్యూ ప్రాంతాలు తౌతే ధాటికి ప్రభావితమయ్యాయి.

More Telugu News