COVID19: పలు రాష్ట్రాలలో పెరుగుతున్న బ్లాక్​ ఫంగస్​ కేసులు.. ఔషధానికి కొరత!

  • యాంఫోటెరిసిన్ బీ వినియోగం పెరుగుదల
  • యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లలో దొరకని మందు
  • దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
  • కేంద్రానికి రాష్ట్రాల ఇండెంట్లు
  • ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ఏర్పాట్లు
Shortage Of Black Fungus Medicine Amphotericin B

మొన్నటిదాకా రెమ్ డెసివిర్ మందులకు కొరత ఏర్పడగా.. ఇప్పుడు ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ కు వాడే మందులకూ కొరత ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దానిని నయం చేసేందుకు ఇటీవలి కాలంలో యాంఫోటెరిసిన్ బీ మందుల వినియోగమూ పెరిగిపోయింది. అయితే, ఆ డిమాండ్ కు తగిన సరఫరా మాత్రం లేదు. కొన్ని చోట్ల ఆ మందులు లేకపోవడంతో బ్లాక్ దందానూ మొదలుపెట్టేశారు.

మొన్నటిదాకా అన్ని ఔషధ దుకాణాల్లో లభించిన ఈ మందు.. ఉత్తరప్రదేశ్ లోని ఇప్పుడు ఏ దుకాణంలోనూ దొరికే పరిస్థితి లేదని లక్నో కెమిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి మయాంక్ రస్తోగి అన్నారు. గత వారం వరకు రోజూ సగటున ముగ్గురు నలుగురే ఆ మందు కోసం రాగా.. ఇప్పుడు ఆరుగురి వరకు వస్తున్నారని చెప్పారు. ఆ మందుల స్టాక్ రావడానికి మరో 15 రోజులైనా పడుతుందన్నారు.

కర్ణాటకలోనూ కేసులు పెరిగిపోతుండడం, యాంఫోటెరిసిన్ మందులు లేకపోవడంతో కనీసం 25 వేల ఇంజెక్షన్లను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కర్ణాటక ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97 దాకా బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లను పిలిచింది. గుజరాత్ ప్రభుత్వం 1,14,430 ఇంజెక్షన్లకు ఆర్డర్ పెట్టింది.

డిమాండ్ భారీగా పెరగడంతో యాంఫోటెరిసిన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసం ఔషధ తయారీ సంస్థలకు ఇప్పటికే రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తులూ పంపింది. దాంతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.

భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్, వాక్ హార్డ్, అబ్బాట్ హెల్త్ కేర్, యునైటెడ్ బయోటెక్, సిప్లా వంటి సంస్థలు యాంఫో టెరిసిన్ ను తయారు చేస్తున్నాయి. ఆ ఐదు సంస్థల్లో ప్రొడక్షన్ ను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఔషధ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. అపర్ణ చెప్పారు. రాష్ట్రాలకు మే 1 నుంచి 14 మధ్య లక్ష వయల్స్ ను అందించినట్టు తెలిపారు.

More Telugu News