Deaths: ఏపీలో కరోనా మరణమృదంగం... ఒక్కరోజులో 101 మంది బలి

  • అనంతపురం జిల్లాలో 14 మంది మృతి
  • రాష్ట్రంలో 9,372కి పెరిగిన కరోనా మరణాలు
  • ఏపీలో గత 24 గంటల్లో 94,550 కరోనా పరీక్షలు
  • 24,171 మందికి పాజిటివ్
  • ఇంకా 2,10,436 మందికి చికిత్స
Corona deaths raises in AP as second wave loomed

ఏపీలో కరోనా మహమ్మారి మృత్యుభేరి మోగిస్తోంది. ఒక్కరోజులోనే 100 మందికి పైగా కరోనాకు బలయ్యారు. గడచిన 24 గంటల్లో ఏపీలో 101 మంది కరోనా కారణంగా మరణించినట్టు తాజా బులెటిన్ లో వెల్లడైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది కన్నుమూయగా, విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది మృత్యువాతపడ్డారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,372కి పెరిగింది.

ఇక, కొత్త కేసుల విషయానికొస్తే... గత 24 గంటల్లో 94,550 కరోనా పరీక్షలు నిర్వహించగా... 24,171 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,885 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,876 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,426 కేసులు, విశాఖ జిల్లాలో 2,041 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఏపీలో ఇప్పటివరకు 14,35,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12,15,683 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,10,436 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News