Congress: రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించడానికి రూ.100 కోట్లతో కర్ణాటక కాంగ్రెస్ ప్రణాళిక!

  • దేశంలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరత
  • వ్యాక్సినేషన్ నిలిపివేసిన పలు రాష్ట్రాలు
  • కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి
  • వ్యాక్సినేషన్ పై ముందుకొచ్చిన కాంగ్రెస్
  • సొంతంగా డోసులు కొనుగోలు చేసేందుకు సన్నద్ధం
Karnataka congress plans to procure corona vaccine with hundred crores

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రస్థాయిలో ఉంది. డబ్బులు ఉన్నప్పటికీ వ్యాక్సిన్లు దొరికే మార్గం లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే, కర్ణాటక విపక్షం కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

రూ.100 కోట్ల వ్యయం ప్లాన్ తో రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా  ఇప్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. వ్యాక్సిన్ కొరత కారణంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు.

వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి నేరుగా డోసులను కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నామని శివకుమార్ చెప్పారు. ఆయన ఇవాళ బెంగళూరులో మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ... మోదీ, యడియూరప్ప ప్రభుత్వాలు పౌరులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో విఫలం అయ్యాయని ఆరోపించారు. అందుకే ఆ బాధ్యతను తాము చేపడుతున్నామని వెల్లడించారు. అందుకోసం తమకు కావాల్సిందల్లా రెండు సాధారణ అనుమతులు మాత్రమేనని, ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి, మరొకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే చాలని శివకుమార్ వివరించారు.

ఈ అంశంలో కూడా రాజకీయాలను చొప్పించవద్దని బీజేపీని కోరుతున్నామని, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నామని స్పష్టం చేశారు.

ఇక మొత్తం రూ.100 కోట్లకు గాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రూ.10 కోట్లు ఇస్తుందని వారు చెప్పారు. మిగతా రూ.90 కోట్లను రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ తమ ప్రాంతీయ అభివృద్ధి నిధుల నుంచి ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ఈ నిధులను వ్యాక్సినేషన్ కు వినియోగించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని వారు తెలిపారు.   

More Telugu News