Atchannaidu: కరోనా కేసులకంటే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులే అధికం: అచ్చెన్నాయుడు

  • ప్రతిపక్ష నేత‌ల‌ను అణచి వేస్తున్నారు
  • ఆ శ్ర‌ద్ధ కరోనా కట్టడిపై చూపించాలి
  • పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
  • మా పార్టీ నేత‌ల‌పై తప్పుడు కేసులు  
atchannaidu slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. త‌మ పార్టీ నేత‌లపై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న మీడియా స‌మావేశంలో ఆరోపించారు. ఏపీలో న‌మోదవుతోన్న‌ కరోనా కేసులకంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువని విమ‌ర్శించారు‌.  

రాష్ట్రంలో ప్రతిపక్ష నేత‌ల‌ను అణచి వేయడానికి వైసీపీ ప్ర‌భుత్వం చూపిస్తోన్న పట్టుదల కరోనా కట్టడిపై చూపిస్తే బాగుంటుంద‌ని అన్నారు. మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు తెనాలి శ్రవణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర వెళితే వారిపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశార‌ని ఆరోపించారు.

ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లేవారిపై పోలీసులు కేసులు పెడితే రాష్ట్రంలో సామాన్య ప్ర‌జ‌లు ఫిర్యాదుల కోసం పోలీసు స్టేషన్‌కి ఎలా వెళ‌తార‌ని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్రంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

అధికార పార్టీ నేతలకు ఒక చట్టం, ప్రతిపక్ష నేతలకు మరో చట్టం అన్న‌ట్లు వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వైసీపీ ప్రోత్సాహంతో త‌మ పార్టీ నేత‌ల‌పై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై  భ‌విష్య‌త్తులో చ‌ర్యలు ఉంటాయ‌ని అచ్చెన్న హెచ్చ‌రించారు.

More Telugu News