Gowtham Sawang: కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తాం: డీజీపీ గౌతమ్ సవాంగ్

  • ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
  • నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవన్న డీజీపీ
  • రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతోందని వెల్లడి
  • అంతర్రాష్ట్ర రాకపోకలపై నిర్ణయం ప్రభుత్వానిదేనన్న సవాంగ్
AP DGP Gowtham Sawang talks about curfew restrictions

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిత్యం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని సవాంగ్ పేర్కొన్నారు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి పొందాలని, కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని తెలిపారు. ఎవరైనా కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే డయల్ 100, 112లకు సమాచారం అందించాలని సూచించారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు షరతులు కొనసాగుతాయని తెలిపారు.

More Telugu News