Prashant Kishor: ప్ర‌శాంత్ కిశోర్ గురించి వ‌చ్చిన ఈ క‌థ‌నంలో నిజం లేదు: స‌్ప‌ష్టం చేసిన‌ ఐ-ప్యాక్

  • ఐ-ప్యాక్ నుంచి 85 శాతం ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు వార్త‌లు
  • త్వ‌ర‌లోనే తొల‌గించిన ఉద్యోగుల‌కు మెయిళ్లు పంపుతార‌ని క‌థ‌నం
  • మ‌ళ్లీ బీహార్‌లో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తార‌ని వార్త‌
The article is factually and materially incorrect on most counts

ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప‌ని చేసిన త‌ర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇన్నాళ్లు త‌న ఇండియ‌న్ పొలిటికల్ యాక్ష‌న్ కమిటీ  (ఐ-ప్యాక్) సంస్థ ద్వారా వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వ‌హించిన ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎన్నికల వ్యూహకర్తగా ఇక‌పై  కొనసాగాలని అనుకోవడం లేదని, దాని నుంచి విరామం తీసుకుని మ‌రో విష‌యంపై దృష్టి పెట్టాల్సి ఉంద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఎన్నో ఊహాగానాలు, వార్త‌లు వ‌స్తున్నాయి. 2020లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ అభిప్రాయాల‌కు భిన్నంగా ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌శాంత్ కిశోర్‌ను జేడీయూ నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం ప్ర‌శాంత్ కిశోర్ బీహార్‌లో త‌న యువ‌త‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి సొంతంగా రాజ‌కీయ కార్య‌క‌లాపాలు కొనసాగించాల‌ని భావించారు. అయితే, అనంత‌రం ఆ ప్ర‌య‌త్నాలను మానుకున్నారు. 2020లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ‌ళ్లీ జేడీయూ-బీజేపీ కూట‌మి విజ‌యం సాధించింది. ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహ‌క‌ర్త‌గా త‌ప్పుకుంటోన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఐ-ప్యాక్ నుంచి దాదాపు 85 శాతం మంది (879 మంది)  ఉద్యోగుల‌ను అందులోంచి తొల‌గించాల‌నుకుంటున్నార‌ని ఓ మీడియాలో క‌థ‌నం వ‌చ్చింది.

ప‌శ్చిమ బెంగాల్లో ఐ-ప్యాక్ త‌ర‌ఫున పనిచేసి వీరంతా కీల‌క పాత్ర పోషించారు. వారిలో దాదాపు 400 మందిని ప్ర‌శాంత్ కిశోర్ కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన నియ‌మించుకున్నారు. ఇప్పుడు 879 మందిలో 150 మందిని మాత్ర‌మే ఐ-ప్యాక్ లో ఉంచుకుని, మిగ‌తా వారందరినీ ఉద్యోగంలోంచి తీసేస్తార‌ని ఓ మీడియా సంస్థ క‌థ‌నాన్ని రాసింది. ఈ మేర‌కు వారంద‌రికీ త్వ‌ర‌లోనే ఈ-మెయిళ్ల ద్వారా లెట‌ర్లు పంప‌నున్న‌ట్లు పేర్కొంది.

తాజాగా, ప్ర‌శాంత్ కిశోర్ ఐ-ప్యాక్ స‌భ్యుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. తొల‌గించ‌ని స‌భ్యుల‌కు కొంత కాలం పెయిడ్ లీవులు ఇచ్చి, అనంత‌రం పంజాబ్ 2022 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌నిచేయ‌డానికి పంప‌నున్న‌ట్లు పేర్కొంది. అంతేగాక‌, బీహార్‌లో యువ‌త‌ను ఒకే తాటిపైకి తెచ్చి మ‌ళ్లీ రాజ‌కీయ కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ భావిస్తున్నార‌ని పేర్కొంది. అయితే, ఈ క‌థ‌నాన్ని త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఐ-ప్యాక్ టీమ్.. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

More Telugu News