Mamata Banerjee: బెంగాల్ ను చేజిక్కించుకునేందుకు దేశాన్ని నాశనం చేసినంత పనిచేశారు: మమతా బెనర్జీ

  • కరోనా సంక్షోభానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమన్న మమత
  • ఆర్నెల్లుగా కేంద్రం ఏ పనీ చేయలేదని విమర్శలు
  • కేంద్రం పెద్దలంతా బెంగాల్ పై పడ్డారని వ్యాఖ్యలు
  • దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం
Mamata Banarjee slams Centre bigwigs for present covid crisis in country

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ఉంటూ ఏ పని చేయకుండా, బెంగాల్ పైనే దృష్టి సారించి, దేశాన్ని పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. గత ఆర్నెల్లుగా ప్రతిరోజూ కేంద్రం పెద్దలు బెంగాల్ ను సందర్శిస్తూనే ఉన్నారని, వారి ప్రయత్నాలన్నీ బెంగాల్ ను చేజిక్కించుకునేందుకే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ను వశం చేసుకునేందుకు దేశాన్ని నాశనం చేసినంత పనిచేశారని మమత మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ గా తృణమూల్ ఎమ్మెల్యే బిమన్ బందోపాధ్యాయ్ మూడోసారి ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలను ప్రేరేపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమిపాలవడంతో బీజేపీ హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును హర్షించలేని వాళ్లు ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News