China: ఎట్టకేలకు మౌనం వీడిన చైనా.. ఆ రాకెట్ శకలాలు భూమిని తాకేలోపే మాడిమసైపోతాయని వివరణ

  • ప్రపంచం మొత్తం ఆందోళన చెందినా ఇప్పటి వరకు స్పందించని చైనా
  • రాకెట్ శకలాలు ఎక్కడ పడుతుందో చెప్పలేమన్న నాసా
  • అనవసర భయాలు వద్దన్న డ్రాగన్ కంట్రీ
  • రాకెట్ శకలాలు కొన్ని నేడు భూమిపై పడే అవకాశం
Chinese rocket is expected to crash down around May 8

నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొస్తున్న చైనా రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళనగా ఉంది. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు స్పందించని చైనా.. తాజాగా పెదవి విప్పింది. ఆ రాకెట్‌తో ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ మాడిమసైపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.

చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి గత నెల 29న కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ ఆ తర్వాత నియంత్రణ కోల్పోయింది. గంటకు 18 వేల మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తోంది. వేల టన్నుల బరువున్న ఈ రాకెట్ శకలాలు భూమిపై పడితే జరిగే నష్టం అపారం. అది భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు తప్ప ఎక్కడ కూలుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం కష్టమని నాసా కూడా ప్రకటించింది. దీంతో భయం మరింత ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో తాజాగా పెదవి విప్పన చైనా ఈ విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదని పేర్కొంది. రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే  చాలావరకు కాలిపోతుందని పేర్కొంది  రాకెట్ శకలాలు ఎక్కడ కూలుతుందన్న విషయంపై తమ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తుంటారని వెన్‌బిన్ తెలిపారు. కాగా, అత్యంత వేగంతో దూసుకొస్తున్న లాంగ్‌మార్చ్ 5బి రాకెట్ శకలాలు కొన్ని నేడు భూమిపై పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News