Nalgonda District: సామాజిక మాధ్యమాలే అడ్డాగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా యువతి అరెస్ట్

  • అభ్యంతరకరంగా చాటింగ్
  • ఆపై డబ్బుల కోసం డిమాండ్
  • పెళ్లి సంబంధాలు చూపిస్తానంటూ యువతుల తల్లిదండ్రుల నుంచి డబ్బుల వసూళ్లు
  • పలు పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదు
Police Arrest Young Girl for cheating via Online

సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకుని మాయమాటలతో వంచిస్తూ పలువురిని మోసం చేస్తున్న యువతిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డి.. హైదరాబాద్‌‌లోని కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేశ్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత అతడితో అభ్యంతరకరంగా చాటింగ్ చేసింది. అనంతరం ఆ వీడియోలు చూపించి బెదిరిస్తూ డబ్బులు గుంజుతోంది. ఆమె బారినపడి మూడు నెలలుగా విలవిల్లాడుతున్న వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అలాగే, మరికొందరు యువతులతో పరిచయం పెంచుకుని వారికి పెళ్లి సంబంధాలు చూస్తానని చెప్పి మోసాలకు పాల్పడింది. వారి తల్లిదండ్రుల నుంచి ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసింది. ఇలా మొత్తంగా రూ.11.70 లక్షలు దండుకుంది. నిందితురాలు మహేశ్వరిపై కూకట్‌పల్లి, ఘట్‌కేసర్, ఖమ్మం, సత్తుపల్లి సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ఆమెను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News