Nara Lokesh: రాజాంలో జరిగిన ఘటన గురించి వినగానే కన్నీరు ఆగలేదు: వీడియో పోస్ట్ చేసిన‌ లోకేశ్

  • ప్రాణాలు పోతుంటే ప్యాలెస్ లో మీకు నిద్ర ఎలా పడుతుంది జ‌గ‌న్ గారు?
  • ఆసుపత్రుల్లో వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్నారు
  • బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరత ఉంది
  • అంజలి గారి మృతి బాధాకరం
lokesh slams ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్ర‌స్తావిస్తూ వైసీపీ స‌ర్కారుపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రోడ్డుపైనే ఓ మ‌హిళ చ‌నిపోయిన‌ ఓ వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు.

'ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్నారు. బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరత. మీ పాలనలో కనీసం పార్థివదేహాన్ని తీసుకెళ్లే దిక్కుకూడా లేదు. రోడ్ల పై ప్రజల ప్రాణాలు పోతుంటే ప్యాలెస్ లో మీకు నిద్ర ఎలా పడుతుంది వైఎస్ జ‌గ‌న్ గారు? అని లోకేశ్ ప్ర‌శ్నించారు.

'వ్యవస్థలను గాలికొదిలి గాలి కబుర్లు చెబుతూ ఎంత కాలం నెట్టుకొస్తారు? రోజుకి నాలుగు ఘటనలు జరుగుతున్నా నిద్రలేవకపోతే ఎలా? మరో పక్క ప్రైవేట్ దోపిడీ. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది' అని లోకేశ్ విమ‌ర్శించారు.

'శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన ఘటన గురించి వినగానే కన్నీరు ఆగలేదు. ఆ కుటుంబం ఉన్న చోట మనం ఉంటే ఏంటి అని ఒక్క సారి ఆలోచించండి జగన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అనుమతిలో ప్రభుత్వ  జాప్యం, డబ్బు కోసం ప్రైవేట్ ఆసుపత్రి ఒత్తిడి కలిసి ఒక ప్రాణాన్ని నడి రోడ్డు మీద బలిగొన్నాయి' అని చెప్పారు.

'అంజలి గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.


More Telugu News