Central Govt: టీకా ధరల్ని తగ్గించండి.. తయారీ సంస్థల్ని కోరిన కేంద్రం

Centre asked institutes to reduce vaccine prices reports PTI
  • మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు
  • ఒకే డోసుకు వివిధ ధరల్ని నిర్ణయించిన సంస్థలు
  • దీనిపై సర్వత్రా విమర్శలు
  • ఒకే దేశం ఒకే ధర ఉండాలని డిమాండ్‌
  • ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందించినట్లు సమాచారం
భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు టీకాల ధరలను తగ్గించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వాటి తయారీ సంస్థల్ని కోరినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వార్తను ప్రచురించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. అలాగే టీకా సంస్థలు ఒకే డోసుపై వివిధ ధరల్ని ప్రకటించడం పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే దేశం ఒకే ధర ఉండాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ తరుణంలో ధరల్ని తగ్గించాలని కేంద్రం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ధరను ఒక్కో డోసుకు కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మరో వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ ధరల్ని వరుసగా.. రూ.150, రూ.600, రూ.1200గా భారత్‌ బయోటెక్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒకే డోసుకు వివిధ ధరల్ని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం మాట్లాడుతూ.. ఇది లాభాలు ఆర్జించేందుకు సమయం కాదని.. వెంటనే ధరల్ని తగ్గించాలని టీకా తయారీ సంస్థల్ని కోరారు. అలాగే కేంద్రం జోక్యం చేసుకొని ధరలపై పరిమితి విధించాలని విజ్ఞప్తి చేశారు.
Central Govt
Coronavaccine
coronavirus
COVAXIN
Covishield

More Telugu News