Jagan: వ్యాక్సిన్ డోసులు పంపండి... మోదీకి లేఖ రాసిన సీఎం జగన్

  • 60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించండి
  • టీకా ఉత్సవ్ లో ఒకే రోజు 6.28 లక్షల డోసులు వేశాం
  • మూడు వారాల్లో 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్ వేస్తాం
Jagan writes letter to Modi

ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ 60 లక్షల డోసులు సరఫరా చేయాలని లేఖలో జగన్ కోరారు. టీకా ఉత్సవ్ లో భాగంగా ఒకే రోజు 6 లక్షల 28 వేల డోసులు వేశామని తెలిపారు.

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది సాధ్యమయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో తగిన సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఏపీలో ప్రతి రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

ఏపీలో వ్యాక్సిన్ డ్రైవ్ ను వాలంటీర్లు సమర్థవంతంగా చేపట్టారని జగన్ పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చూస్తున్నామని చెప్పారు. రానున్న మూడు వారాల్లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వెంటనే ఏపీకి 60 లక్షల కరోనా డోసులను అందించాలని చెప్పారు.

More Telugu News