Vaccination: దేశంలో కోవిడ్ ఉద్ధృతికి కారణాలు ఇవేనట!

  • అజాగ్రత్త, బహిరంగ కార్యక్రమాలే ప్రధాన కారణం
  • అవసరం లేకున్నా టీకాలు వాడేయడం వల్ల చాలా వరకు వృథా అయ్యాయి
  • టీకాలు వేయడంలో నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయింది
  • ప్రముఖ వైరాలజిస్టులు జమీల్, జాకోబ్
These are the reasons for covid cases

కకరోనాలో కొత్త రకాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండడం, ఎన్నికలు, బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం నెమ్మదిగా సాగడం వంటివి దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. టీకా తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించకపోవడం కూడా మరో కారణమని అంటున్నారు.

కరోనా వైరస్ మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజల్లో అలసత్వం పెరిగిందని ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్ జమీల్, టి. జాకోబ్ జాన్‌లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే తొలుత అలసత్వం ప్రదర్శించిందని, ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ప్రజల్లోనూ అది పెరిగిందని అన్నారు. సిబ్బంది మొత్తానికి టీకాలు ఇవ్వకుండానే పాఠశాలలు తెరిచారని అన్నారు. మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు.

దీనికితోడు టీకాలు వేయడంలోనూ నిర్దిష్ట లక్యం ఏమీ లేకుండానే పోయిందన్నారు. కొన్ని చోట్ల అవసరం లేనప్పటికీ టీకాలు వేయడం వల్ల చాలా టీకాలు వృథా అయ్యాయన్నారు. మార్చి మొదటి నుంచే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఆరోగ్య కార్యకర్తలు, వృద్దులు టీకాలు తీసుకునేందుకు ముందుకు రాలేదన్నారు. దేశంలో ఇప్పటివరకు 5 శాతం మంది మాత్రమే తొలి విడత టీకా డోసు తీసుకున్నారని, 0.7 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే వ్యాక్సినేషన్ ప్రభావం అంతగా కనిపించడం లేదని జమీల్, జాకోబ్ జాన్‌ వివరించారు.

More Telugu News