Delhi: పంజా విసురుతున్న కరోనా.. దేశ రాజధానిలో ఈ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ!

  • ఏప్రిల్ 30 వరకు ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
  • కేసులు పెరుగుతుండటంతో కర్ఫ్యూ విధిస్తున్నామన్న ఢిల్లీ సర్కార్
  • గర్భిణులకు, అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారికి వెసులుబాటు
Delhi Night Curfew From Today

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయంటే... పరిస్థితి ఎంతగా దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు కొత్తగా నమోదవుతున్న కేసులతో తల్లడిల్లుతున్నాయి. అందరూ స్వీయ నియంత్రణలు పాటించాలని ప్రజలను కోరుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సైతం కరోనాతో బెంబేలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా కేసులు ఊహించని విధంగా పెరగడం, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో... నైట్ కర్ఫ్యూ విధించడం తప్పలేదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు కొనసాగుతాయని, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లే వారికి అభ్యంతరం ఉండదని తెలిపింది. నైట్ కర్ఫ్యూ సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లే వారికి... ఈ-పాసులు ఇస్తామని చెప్పింది.

జర్నలిస్టులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వారి ఐడీ కార్డులను కచ్చితంగా కలిగి ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. గర్భిణులు, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునే వారికి వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపింది. 2.5 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో... ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేజ్రీవాల్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

More Telugu News