AP SEC: పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ఎస్ఈసీ

  • ఏపీలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్
  • హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జనసేన
  • అంతకుముందే పలు పిటిషన్ల దాఖలు
  • తాజాగా 45 పేజీలతో ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్
  • నిబంధన ప్రకారమే ఎన్నికలంటూ స్పష్టీకరణ
AP SEC files counter affidavit in high court

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల సంఘం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారమే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తమ 45 పేజీల అఫిడవిట్ లో ఎస్ఈసీ స్పష్టం చేశారు. గతంలో కరోనా వ్యాప్తి కారణంగా నిలిచిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

కొన్నిరోజుల కిందటే ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు పరిషత్ ఎన్నికల అంశంలోనే మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News