Corona Virus: కరోనా పంజా.. ఏపీలో మరోసారి వెయ్యికి చేరువవుతున్న కొత్త కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 947 కొత్త కేసులు
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు
  • ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్ కేసులు
Corona cases in AP reaching 1000

ఆంధ్రప్రదేశ్ పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 42,696 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖ జిల్లా (156), గుంటూరు జిల్లా (145) ఉన్నాయి. ఇదే సమయంలో ఒక్కరు కూడా మృతి చెందకపోవడం ఊరట కలిగించే విషయం. గత 24 గంటల్లో 377 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,97,810కి చేరుకుంది. 8,85,892 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,203 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News