Yanamala: యువత మాఫియా ఉచ్చులో చిక్కుకుంటోంది: యనమల

  • ఏపీలో అండర్ గ్రౌండ్ మాఫియా పెరుగుతోంది
  • వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు
  • జగన్ పగలు, ప్రతీకారాలకు ముగింపు పలకాలి
AP youth are falling into the mafia trap says Yanamala

ఆంధ్రప్రదేశ్ లో అండర్ గ్రౌండ్ మాఫియా పెరుగుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీయిజం, గూండాయిజంను వైసీపీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని చెప్పారు. వాటాలు కావాలంటూ పరిశ్రమలను బెదిరించి, వాటిని రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని తెలిపారు. తద్వారా ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని అన్నారు.

 వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు సాగిస్తున్న దందాలతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారని అన్నారు. యువతను మాదకద్రవ్యాల మత్తులో ఉంచి, వారి భవిష్యత్తును కాలరాస్తున్నారని మండిపడ్డారు.

పండుగ కానుకల రద్దు, అన్నా క్యాంటీన్ల రద్దుతో పేదల పొట్ట కొట్టారని యనమల అన్నారు. పొట్టకూటి కోసం యువత మాఫియా ఉచ్చులో చిక్కుకుంటోందని చెప్పారు. మాఫియా గ్యాంగులకు యువత రక్షణ కవచంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం 24 శాతానికి, పేదరికం 20 శాతానికి పెరిగిందని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ పగలు, ప్రతీకారాలకు ముగింపు పలకాలని, రాజకీయ కక్షలను ఆపేయాలని... పేదల సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. మాఫియా ముఠాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులపై దృష్టి సారించి, ఉపాధి అవకాశాలను సృష్టించి, యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు.

More Telugu News