Ayodhya Ramireddy: విశాఖ ఉక్కుపై కేంద్రం చర్యలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు: రాజ్యసభలో అయోధ్య రామిరెడ్డి

  • పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలన్న అయోధ్య రామిరెడ్డి
  • ఏపీ ప్రజల భావోద్వేగాల అంశమని వెల్లడి
  • స్టీల్ ప్లాంట్ ను జాతీయ ఆస్తిగా పరిగణించాలని వినతి
  • భావితరాలకు సంపద సృష్టిస్తుందని వివరణ
YCP Ayodhya Ramireddy raises Vizag Steel Plant issue in Rajyasabha

వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పార్లమెంటు సమావేశాల్లో విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణను ఆపాలని కేంద్రాన్ని కోరారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం చర్యల పట్ల రాష్ట్ర ప్రజలంతా నిరసిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ తో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని అయోధ్య రామిరెడ్డి వివరించారు.

మంచి పనితీరు కలిగిన సంస్థలను జాతీయ ఆస్తిగా పరిగణించి రక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంస్థలు భావితరాలకు సంపద సృష్టించి, భద్రత కల్పిస్తాయని తెలిపారు. పైగా, పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు కీడు చేస్తుందని అభిప్రాయపడ్డారు. నష్టాల్లో ఉన్న సంస్థలను ఆధునిక విధానాల్లో నిర్వహించడం ద్వారా వాటిని చక్కదిద్దవచ్చని ఈ వైసీపీ ఎంపీ సూచించారు.

More Telugu News