Mamata Banerjee: సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులంతా వాలిపోయారు: మమతా బెనర్జీ

  • నన్ను చంపేందుకు కుట్ర జరిగింది
  • బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల గొంతుకను నొక్కేస్తారు
  • గాయపడిన ఆడపులి చాలా ప్రమాదకరం
Mamata Banerjee fires on BJP

తనను చంపేందుకు కుట్ర జరిగిందని... అయితే, ఆ కుట్ర త్రుటిలో తప్పిపోయిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేంద మంత్రులంతా హోటళ్లు బుక్ చేసుకున్న ప్రదేశంలోనే తనపై దాడి జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో టీఎంసీ పార్టీ లేకుండా చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం చేత తప్పుడు కేసులు వేయించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

పశ్చిమబెంగాల్ లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని... ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల గొంతుకను నొక్కేస్తుందని మమత అన్నారు. వాస్తవానికి బీజేపీకి ప్రజల మద్దతు లేదని... అందుకే, జనాలను కొనుగోలు చేసి సభలకు రప్పిస్తున్నారని తెలిపారు. బీజేపీ తనను ఎంత వేధించినా లెక్క చేయనని... బెదిరించడం ద్వారా తనను ఆపలేరని అన్నారు. ఒంటి కాలితోనే తాను పోరాటం చేస్తానని అన్నారు. తన తల్లులు, కూతుళ్ల రెండు కాళ్ల సాయంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. గాయపడిన ఆడపులి చాలా ప్రమాదకరమని అన్నారు.

బెంగాల్ లో ఎక్కడ చూసినా కేంద్ర మంత్రులే కనిపిస్తున్నారని మమత అన్నారు. ఎన్నికల ప్రచారం తప్ప వారికి వేరే పనేమీ లేదా? అని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో, తుపాన్లు అతలాకుతలం చేసిన సమయాల్లో ఒక్క కేంద్ర మంత్రి కూడా కనిపించలేదని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే సిగ్గులేకుండా బెంగాల్ కు వచ్చేశారని దుయ్యబట్టారు.

More Telugu News