Sand Storm: ఇసుక తుపాను గుప్పిట్లో విలవిల్లాడుతున్న చైనా రాజధాని

  • బీజింగ్ పై ఇసుక తుపాను పంజా
  • గత దశాబ్దకాలంలో ఇదే తీవ్ర తుపాను
  • బీజింగ్ లో ఎక్కడ చూసినా ఇసుకే
  • స్కూళ్ల మూసివేత.. క్రీడా పోటీల నిలిపివేత
Sand storm hits China capital Beijing

చైనా రాజధాని బీజింగ్ గత కొన్నిరోజులుగా భీకర ఇసుక తుపానుతో అతలాకుతలం అవుతోంది. గత దశాబ్ద కాలంలో ఇంతటి తీవ్ర ఇసుక తుపాను ఎన్నడూ సంభవించలేదని చైనా వాతావరణ శాఖ పేర్కొంది.

ఓవైపు వాయు కాలుష్యం, మరోవైపు ఇసుక తుపానుతో బీజింగ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీజింగ్ లోని అన్ని ప్రాంతాలపైనా ఇసుక తుపాను పంజా విసిరింది. ఎక్కడ చూసినా ఇసుక పరుచుకుని ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. చైనాలోని పలు ప్రావిన్సులు ఇసుక తుపాను ధాటికి గజగజలాడుతున్నాయి.

మధ్య, ఉత్తర మంగోలియాలో ఈ తుపాను గాలులు ఉత్పన్నం కాగా, ఎగువ నుంచి వీస్తున్న చలిగాలులతో ఈ తుపాను మరింత ఉద్ధృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇసుక తుపాను నేపథ్యంలో పాఠశాలలు మూసివేశారు. అవుట్ డోర్ క్రీడా పోటీలను నిలిపివేశారు. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

More Telugu News