Rs.2000: గత రెండేళ్లుగా రూ.2000 నోట్లను ముద్రించడంలేదు: కేంద్రం

  • గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం
  • విపణిలోకి రూ.2000 నోట్లు
  • కొంతకాలానికే తగ్గిన లభ్యత
  • 2019 నుంచి ముద్రణ నిలిపివేశామన్న అనురాగ్ ఠాకూర్
Centre clarifies on two thousand rupees currency notes

ఎన్డీయే సర్కారు గతంలో పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. అయితే కొద్దికాలానికే వీటి లభ్యత తగ్గిపోయింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

ఈ నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు, నల్లడబ్బు రూపేణా విపణిలో చలామణీ చేసే అవకాశం ఉందని... అందుకే ఈ నోట్ల ముద్రణను రెండేళ్లుగా నిలిపివేసినట్టు వివరించారు. లోక్ సభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించిన మీదటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

2018 మార్చి 30 నాటికి దేశంలో 3,362 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉండగా... 2021 ఫిబ్రవరి నాటికి కేవలం 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.

More Telugu News