KCR: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలన్న సీఎం కేసీఆర్

  • 75 వారాల పాటు దేశవ్యాప్తంగా వేడుకలు
  • 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట ఉత్సవాలకు పిలుపునిచ్చిన కేంద్రం
  • తెలంగాణలో జరిపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
  • ఈ ఏడాది మార్చి 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు వేడుకలు
  • రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడి
KCR orders for India independence celebrations

దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో కేంద్రం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ ప్రాంతం ఎంతో విశిష్ట పాత్ర పోషించిందని వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు ఈ వేడుకలు ఉంటాయని, అందుకోసం రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా, మార్చి 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోనూ, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్ లోనూ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్, వరంగల్ లో జరిగే కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

More Telugu News