Patna: జూమ్ కాల్ ఆన్ లో ఉండగా భోజనం లాగించేసిన న్యాయవాది... సొలిసిటర్ జనరల్ సరదా కామెంట్స్.. వీడియో ఇదిగో!

  • పట్నాలో జరిగిన కేసు విచారణ
  • తన వాదన వినిపించి తినడానికి వెళ్లిన న్యాయవాది
  • తనకూ పంపాలని కోరిన తుషార్ మెహతా
Viral Video of a Lawyer who Take Melas on Live

కరోనా కారణంగా కోర్టు కేసులు కూడా ఆన్ లైన్ లో సాగుతున్న వేళ, ఓ న్యాయవాది తన వాదనలు వినిపించి, ఆపై వీడియో కాల్ ను ఆపడం మరచిపోయి, భోజనం చేయడం ప్రారంభించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. జూమ్ కాల్ కొనసాగుతున్న వేళ, సదరు న్యాయవాది, తింటుంటే, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా సరదాగా స్పందిస్తూ, తనకు కూడా భోజనం పంపాలని అంటుంటే, ఆ మాటలు కూడా అతను వినకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ఈ ఘటన బీహార్ లోని పట్నాలో జరిగింది. కొన్ని నెలలుగా కోర్టు విచారణలన్నీ జూమ్ కాల్ ద్వారా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పట్నాకు చెందిన ఓ న్యాయవాది ఒక కేసు విచారణలో పాల్గొన్నారు. ఇదే కేసులో తుషార్ మెహతా కూడా ప్రాసిక్యూషన్ తరఫున ఉన్నారు. తన వాదనలు పూర్తయిన తరువాత, విచారణ సాగుతుండగానే, కాల్ ను కట్ చేయకుండా, ఓ ప్లేట్ ను ముందేసుకుని ఆ న్యాయవాది భోజనం ప్రారంభించారు.

తొలుత కెమెరా ఆన్ లోనే ఉందని చెప్పడానికి తుషార్ మెహతా ప్రయత్నించినా, ఆ అడ్వకేట్ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోతున్న అతనికి, స్వయంగా ఫోన్ కాల్ చేసిన ఆయన, పరిస్థితిని చెప్పగా, తింటున్న ప్లేటును పక్కన బెట్టి బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడా న్యాయవాది. దీంతో పరిస్థితిని కాస్తంత సద్దుమణిగేలా చేస్తూ, తింటున్న భోజనం తనకు కూడా పంపాలని తుషార్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదే కేసులో భాగమైన మిగతా న్యాయవాదులు, ఈ మొత్తం ఘటన చూస్తూ పగలబడి నవ్వారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News