Nalgonda District: బీమా సొమ్ము కోసం వ్యక్తులను చంపేస్తున్న ముఠా అరెస్ట్.. కోట్లలో క్లెయిమ్‌లు!

  • అనారోగ్యంతో ఉన్న వారిని ఎంచుకుని బీమా
  • నామినీతో ఒప్పందం కుదుర్చుకుని హత్య
  • వాహనంతో తొక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
  • ఇప్పటి వరకు ఐదారుగురి హత్య
  • పోలీసుల అదుపులో 17 మంది!
Insurance Agents killed 6 persons and claim in crores of rupees

అనారోగ్యంతో బాధపడుతున్న వారితో బలవంతంగా బీమా చేయించి, ఆపై వారిని హత్యచేసి బీమా సొమ్మును కొట్టేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురిని మట్టుబెట్టిన విషయం తెలిసి పోలీసులే విస్తుపోయారు.

వారి కథనం ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించిన అనంతరం ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకటి రెండు ప్రీమియంలను వారే చెల్లించేస్తారు.

ఆ తర్వాత ముఠా సభ్యులు తమ పథకాన్ని అమలు చేస్తారు. బీమా చేయించుకున్న వ్యక్తి నామినీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఆ పై వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు. ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేస్తారు. వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టు సమాచారం.

దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు.

దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులను ఆయన భార్య నమ్మించింది. అయితే, అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసిన ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా దందా వెలుగులోకి వచ్చింది.

బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు అంగీకరించింది. ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిని రిమాండ్‌కు పంపనున్నట్టు సమాచారం.

More Telugu News