Rahul Gandhi: మోదీ ఈ దేశానికి ఉపయోగకరమా? కాదా? అనేది ప్రశ్న కాదు: రాహుల్ గాంధీ

  • కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే మోదీ ఉపయోగకరం
  • మోదీ వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదు
  • చైనాను చూసి మోదీ భయపడుతున్నారు
Modi is useful to only 2 persons says Rahul Gandhi

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చైనాను చూసి మోదీ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలోని కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల కోసం ఆయన పని చేస్తున్నారని విమర్శించారు.

మోదీ ఈ దేశానికి ఉపయోగకరమా? కాదా? అనేది ప్రశ్న కాదని... ఆయన వల్ల ఎవరికి ఉపయోగకరం అనేదే ప్రశ్న అని అన్నారు. తమ సంపదను అమాంతం పెంచుకుంటున్న ఇద్దరు వ్యక్తులకే ఆయన అత్యంత ఉపయోగకరమని అన్నారు. పేదలకు మోదీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.

మనం ఇద్దరు (మోదీ, అమిత్ షా), మనకు ఇద్దరు (అంబానీ, అదానీ) అనేదే ప్రధాని నినాదమని రాహుల్ దుయ్యబట్టారు. తమిళనాడు తూత్తుకుడిలోని ఓ కాలేజీలో లాయర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనాను చూసి మోదీ భయపడుతున్నారని రాహుల్ అన్నారు. ఒక వ్యూహం ప్రకారం 2017లో డోక్లాంను ఆక్రమించుకుని భారత్ ను చైనా టెస్ట్ చేసిందని చెప్పారు. అప్పుడు భారత్ సరిగా ప్రతిస్పందించకపోవడంతో... ఆ తర్వాత లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లో అదే వ్యూహాన్ని చైనా అమలు చేసిందని తెలిపారు. మోదీ తమకు భయపడుతున్నాడని చైనాకు అర్థమయిందని... అప్పటి నుంచి ఆ భయాన్ని చైనా తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. చైనా ఆక్రమించుకున్న భూమిని మోదీ వెనక్కి తీసుకురాలేరని అన్నారు.

More Telugu News