NSE: ఎన్ఎస్ఈకి ముచ్చెమటలు పట్టించిన రెండు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు

  • నిన్న 11.40కి ఆగిపోయిన ఎన్ఎస్ఈ ట్రేడింగ్
  • సర్వీస్ ప్రొవైడర్ల వల్లే సమస్య అని ప్రకటించిన ఎన్ఎస్ఈ
  • ఇండియాలోని 80 శాతం డెరివేటివ్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్న ఎన్ఎస్ఈ
2 Telecom Lines Fail To Protect NSE

ప్రపంచంలోనే అతి పెద్ద డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ గా పేరుగాంచిన ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) నిన్న కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. నిన్న ఉదయం 11.40 గంటలకు ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ఆగిపోయింది. అప్పటి వరకు ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సర్వీసులు ఆగిపోవడంతో అయోమయంలో పడిపోయారు. ఆ తర్వాత ట్రేడింగ్ మళ్లీ పునఃప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ట్రేడింగ్ ను మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ కొనసాగించింది.

మరోవైపు టెక్నికల్ సమస్యల వల్ల ట్రేడింగ్ ఆగిపోవడంపై మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ విచారణకు ఆదేశించింది. గతంలో కూడా ట్రేడింగ్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే, నిన్న చాలా సేపు ట్రేడింగ్ ఆగిపోవడం కలకలం రేపింది. ప్రపంచంలోనే అత్యధిక ఫ్యూచర్స్ మరియు కాంట్రాక్టులు ఎన్ఎస్ఈలో ఉన్నాయి. ఈరోజుతో ఆ కాంట్రాక్టులు ముగియనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ముందు ట్రేడింగ్ ఆగిపోవడం చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి ఎన్ఎస్ఈకి భారతి ఎయిర్ టెల్, టాటా కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ సేవలను అందిస్తున్నాయి. ఆసక్తికర పరిణామం ఏమిటంటే... అదే సమయంలో ఈ రెండు సర్వీస్ ప్రొవైడర్లు డౌన్ అయ్యాయి. ఈ రెండు ప్రొవైడర్లు ముంబై నుంచి దక్షిణాదిన ఉన్న చెన్నైకి తరలుతున్నాయనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది.

 మరోవైపు ట్రేడింగ్ ఆగిపోయిన గంట తర్వాత ఎన్ఎస్ఈ స్పందిస్తూ, సర్వీస్ ప్రొవైడర్ల వల్లే సమస్య తలెత్తిందని ప్రకటించింది. ఎంత సేపట్లో ట్రేడింగ్ పునఃప్రారంభవుతుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపింది. అయితే ఎన్ఎస్ఈ చేసిన కామెంట్లపై స్పందించేందుకు భారతి ఎయిల్ టెల్, టాటా కమ్యూనికేషన్స్ నిరాకరించాయి.

ఇండియాలో ఎన్ఎస్ఈ అతి పెద్ద స్టాక్ మార్కెట్ గా కొనసాగుతోంది. బీఎస్ఈ కంటే రెండింతలు ఎక్కువ స్టాక్ వాల్యూమ్ ఎన్ఎస్ఈకి ఉంది. ఇండియాలోని 80 శాతం డెరివేటివ్ మార్కెట్ ని ఎన్ఎస్ఈ కంట్రోల్ చేస్తోంది.

గత కొన్ని నెలలుగా ఆసియా మార్కెట్లను టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయి. గత అక్టోబరులో టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ ని హార్డ్ వేర్ సమస్య ఇబ్బంది పెట్టింది. నవంబర్ 16న ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్ఛేంజ్ సాఫ్ట్ వేర్ సమస్య వల్ల అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ టెక్నికల్ సమస్యల వల్ల కోట్లాది మంది ముదుపరుల తలరాత తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

More Telugu News