Lawyer: న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ.. హత్యాయత్నమన్న బాధితుడు

  • హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న లాయర్ దుర్గాప్రసాద్
  • వెనుక నుంచి వచ్చి కారును ఢీకొన్న లారీ
  • తనకు హాని కలిగించేందుకు దాడికి పాల్పడ్డారన్న లాయర్
Murder attempt on another lawyer in Telangana

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు లాయర్ వామనరావు దంపతులను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు మరొక లాయర్ పై హత్యాయత్నం జరగడం చర్చనీయాంశంగా మారింది.

 హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై హైకోర్టు లాయర్ దుర్గాప్రసాద్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వరంగల్ లో భూవివాదానికి సంబంధించిన ఓ కేసును వాదించేందుకు ఆయన తన కారులో బయలుదేరారు. జనగామ మండలం యశ్వంత్ పూర్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఆయన కారును ఢీకొంది. కొంత దూరం వరకు కారును లారీ లాక్కెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

జరిగిన ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు హాని కలిగించేందుకే ఈ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. మరోవైపు లారీ డ్రైవర్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. అతన్ని పోలీసులకు అప్పగించారు.  బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులకు డ్రైవర్ చెప్పినట్టు సమాచారం.

More Telugu News