Narendra Modi: 'అంతా బాగానే ఉందా'? అంటూ డీకే అరుణను పలకరించిన నరేంద్ర మోదీ!

  • నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
  • పలువురిని వ్యక్తిగతంగా పలకరించిన మోదీ
  • తన రాజకీయ ప్రయాణం ముళ్లబాటేనన్న ప్రధాని
Modi Talks with DK Aruna

నిన్న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగగా, ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరైన డీకే అరుణను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించి, కుశల ప్రశ్నలు అడిగారు. అంతా బాగానే ఉందా? (సబ్ ఠీక్ హైనా అరుణా జీ) అంటూ, తనకు తారసపడిన ఆమెను మోదీ ప్రశ్నించారు. ఈ ఘటన సమావేశాల టీ బ్రేక్ సమయంలో కనిపించింది. పలువురు నేతలను వ్యక్తిగతంగా కలిసిన ప్రధాని, వారి వారి రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై వివరాలు అడిగారు.

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, నూతన సాగు చట్టాలపై రైతులకు సవివరంగా తెలియజేసే బాధ్యత బీజేపీ జాతీయ కార్యవర్గంపైనే ఉందని, ప్రతి ఒక్కరూ తమతమ ప్రాంతాలకు వెళ్లి, ఈ చట్టాల ఉపయోగాల గురించి వివరించాలని మోదీ సూచించారు. రైతుల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు గ్రామాల రూపురేఖలను మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

తన రాజకీయ జీవితం ముళ్లబాటలోనే సాగుతూ వచ్చిందని, తాను ప్రజల గురించి తప్ప ఎన్నడూ వ్యక్తిగత స్వలాభాల కోసం ఆలోచించలేదని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ సమావేశాలు గత సంవత్సరం బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే జరగాల్సి వుండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.

More Telugu News