Myanmar: శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు అంద‌రికీ ఉంటుంది: ఐరాస‌

  • వారిపై హింసకు పాల్ప‌డ‌డం స‌రికాదు
  • మయన్మార్‌లో కొన్ని రోజులుగా సైనిక పాలన
  • ఎన్నికల ఫలితాలను గౌరవించాలి
un condemns army violence in Myanmar

పౌరుల ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేయ‌డానికి వారిపై హింసకు పాల్ప‌డ‌డం స‌రికాద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. మయన్మార్‌లో కొన్ని రోజులుగా సైనిక పాలనకు వ్య‌తిరేకంగా పౌరులు పోరాడుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌నకారుల‌ను అణ‌చివేసేందుకు సైనికులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డంతో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనిపై ఐరాస ప్ర‌ధాన‌ కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ రోజు ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... మయన్మార్‌లో సైనిక పాలనను ర‌ద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న పౌరులపై హింస‌కు పాల్ప‌డ‌డాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని చెప్పారు.

పౌరులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నార‌ని, అటువంటి వారిని బెదిరింపులకు గురిచేయడం స‌రికాద‌ని తెలిపారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు అంద‌రికీ ఉంటుందని ఆయ‌న చెప్పారు. అన్నిపార్టీలు ఎన్నికల ఫలితాలను గౌరవించాల‌ని ఆయ‌న చెప్పారు. మ‌య‌న్మార్‌లో మ‌ళ్లీ పౌర పాలన నెలకొనేలా చూడాలని కోరారు.


More Telugu News