DCP Ravinder: న్యాయవాద దంపతుల హత్యకేసు.. నాగమణి ఆడియో వైరల్

  • ఇటీవల దారుణ హత్యకు గురైన నాగమణి దంపతులు
  • రక్షణ కోసం తమను సంప్రదించలేదన్న పోలీసులు
  • కుంట శ్రీనివాస్ నుంచి రక్షణ కావాలంటూ డీసీపీకి ఫోన్ చేసి అభ్యర్థించిన నాగమణి
Late lawyer Nagamani Audio clip viral

ఇటీవల దారుణ హత్యకు గురైన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి రక్షణ కావాలంటూ తమను ఎప్పుడూ సంప్రదించలేదని పోలీసులు చెప్పి ఒక్కరోజైనా కాకముందే సంచలన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. హత్యకు గురైన న్యాయవాది నాగమణి డీసీపీ రవీందర్‌కు చేసిన ఫోన్ కాల్ అది. ఇప్పుడీ ఆడియో బయటకు వచ్చి కలకలం రేపుతోంది.

గుంజపడుగు గ్రామంలోని ఆలయం విషయంలో కుంట శ్రీనివాస్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని ఆమె అందులో వేడుకున్నారు. కుంట శ్రీనివాస్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఎస్ఐ అయితే తాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, మీరైనా స్పందించి రక్షణ కల్పించాలని వేడుకోవడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

డీసీపీ మాత్రం న్యాయవాదులకు రక్షణ కల్పించే విషయంలో పదేపదే దాటవేత ధోరణి అవలంబించారు. ఇది పోలీసుల పరిధిలోకి రాదని, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించడం గమనార్హం. అంతేకాదు, ప్రతి విషయానికి పోలీసులను మధ్యలోకి లాగొద్దని హితవు పలికారు.

వాస్తవం ఇలా ఉంటే నాగమణి దంపతులు రక్షణ కోసం తమను ఎప్పుడూ సంప్రదించలేదని విలేకరుల సమావేశంలో గురువారం పోలీసులు చెప్పడం గమనార్హం. కాగా, కలకలం రేపుతున్న ఈ ఆడియోపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు.

More Telugu News