క్యాపిటల్​ హిల్​ పై దాడికి కారణం ట్రంపే: కోర్టులో డెమొక్రటిక్​ ప్రతినిధి​ వ్యాజ్యం

Donald Trump and Giuliani sued for conspiring to incite Capitol Hill riots
  • దాడి విధ్వంసానికి పరిహారం ఇప్పించాలని వినతి
  • పిటిషన్ లో అమెరికా మాజీ అధ్యక్షుడి లాయర్ గిలియానీ పేరు
  • మరో రెండు రైట్ వింగ్ సంస్థలపైనా ఆరోపణలు
  • కూ క్లూ క్లాన్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్న థాంప్సన్
  • వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి
క్యాపిటల్ హిల్ పై జనవరి 6న జరిగిన దాడికి నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమని డెమొక్రటిక్ ప్రతినిధుల సభ సభ్యుడు బెన్నీ థాంప్సన్ ఆరోపించారు. ట్రంప్, ఆయన వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీ, మరో రెండు రైట్ వింగ్ సంస్థలు ప్రౌడ్ బాయ్స్, ఓత్ కీపర్స్ పై వాషింగ్టన్ లోని జిల్లా కోర్టులో థాంప్సన్ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆందోళనకారులు చట్టసభపై దాడికి పాల్పడేలా వారు రెచ్చగొట్టారని పిటిషన్ లో థాంప్సన్ ఆరోపించారు. శ్వేత జాత్యహంకారాన్ని అణచాలన్న ఉద్దేశంతో 1871లో తీసుకొచ్చిన కూ క్లూ క్లాన్ చట్టాన్ని వారు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ట్రంప్, గిలియానీ, ఆ రైట్ వింగ్ సంస్థలు వేసిన పక్కా ప్లాన్ లో భాగంగానే దాడులు జరిగాయని ఆరోపించారు. చట్ట ప్రకారం జరిగిన ఎన్నికలను ఆపేసేందుకు అందరూ బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు.

క్యాపిటల్ హిల్ లోకి ప్రవేశించిన దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు తాను దాక్కున్నానని, అక్కడే తుపాకీ పేలిన శబ్దాలూ విన్నానని థాంప్సన్ పేర్కొన్నారు. కాబట్టి భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ట్రంప్ సహా పిటిషన్ లో పేర్కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కోర్టు ఖర్చులతో పాటు వారి దాడి వల్ల క్యాపిటల్ హిల్ కు కలిగిన నష్టాన్ని భరించేలా వారిని ఆదేశించాలని కోర్టును కోరుతూ వ్యాజ్యం వేశారు.
Go Back to Shorts
Donald Trump
USA
House Of Representatives
Capitol Hill

More Telugu News