West Godavari District: భీమవరం రొయ్యల వ్యాపారి కొత్తగూడెంలో దారుణ హత్య

  • ఈ నెల 11 నుంచి కనిపించకుండా పోయిన వ్యాపారి
  • వ్యాపార భాగస్వాములే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు
  • ఓ వ్యక్తికి రూ. 1.5 కోట్లు చెల్లించే విషయంలో గొడవలు
Bhimavaram business man killed in Khammam

ఈ నెల 11 నుంచి కనిపించకుండా పోయిన భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండరామారావు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. 39 ఏళ్ల కోదండరామారావు రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 11 నుంచి ఆయన కనిపించడం లేదని ఆ తర్వాతి రోజున కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఆయన కోసం గాలిస్తున్న భీమవరం పోలీసులకు కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట-దమ్మపేట మండలాల సరిహద్దులోని ఓ జీడిమామిడి తోటలో మృతదేహం పడి ఉన్నట్టు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు రామారావు కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ మృతదేహం తన భర్తదేనని కోదండరామారావు భార్య లీలాకుమారి గుర్తించి కన్నీటి పర్యంతమైంది.

కాగా, ఈ హత్య వెనుక ఆయన వ్యాపార భాగస్వాములే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన ఓ వ్యక్తికి రామారావు రూ. 1.5 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ విషయంలో గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 11వ తేదీన బలుసుమూడికి చెందిన ఓ వ్యక్తి ఆయనను తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News