Botsa Satyanarayana: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: బొత్స

  • స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నది వాస్తవమేనన్న బొత్స
  • కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి
  • స్టీల్ ప్లాంట్ విశాఖకే పరిమితం కాదని వెల్లడి
  • ఆంధ్రుల సెంటిమెంట్ కు సంబంధించిన సంగతి అని వివరణ
Botsa comments on Vizag Steel Plant privatisation

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్నది వాస్తవమేనని తెలిపారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించారు.

స్టీల్ ప్లాంట్ అనేది ఒక్క విశాఖపట్నానికో, విజయనగరానికో, శ్రీకాకుళానికి పరిమితమైన అంశం కాదని, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చెందిన అంశమని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల సెంటిమెంట్లకు సంబంధించిన విషయమని అన్నారు. దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేది తమ అభిప్రాయమని, దీన్ని అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు, ఏంచేస్తే ప్రైవేటీకరణ ఆగుతుందో అంతవరకు వెళ్లడానికి తాము సిద్ధమేనని బొత్స ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ తన లేఖలో స్పష్టం చేశారని, ఆ మేరకు ముందుకు వెళతామని పేర్కొన్నారు.

More Telugu News