Pawan Kalyan: పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది: షర్మిల పార్టీ వార్తలపై పవన్ కల్యాణ్

Pawan Kalyan response on Sharmila party
  • తెలంగాణాలో పార్టీని పెడుతున్న షర్మిల 
  • తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా
  • కేసీఆర్ పాలన గురించి హైదరాబాదులో ఉన్నప్పుడే మాట్లాడుతా
వైయస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీకి చెందిన షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టనుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కు ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ, పార్టీ పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. ఆయినా ఆమె ఇంకా పార్టీని స్థాపించలేదు కదా? పార్టీకి సంబంధించి పూర్తి సమాచారం, విధివిధానాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే తాను కోరుకుంటున్నానని అన్నారు.

కేసీఆర్ పాలనపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా... హైదరాబాదులో ఉన్నప్పుడే కేసీఆర్ పాలన గురించి తాను మాట్లాడతానని చెప్పారు. కాగా, పవన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, దేవాలయాలపై దాడులు తదితర అంశాలపై చర్చించారు.

More Telugu News

Pawan Kalyan
Janasena
YS Sharmila
KCR
TRS