Narendra Modi: జో బైడెన్ తో మాట్లాడాను.. పలు అంశాలు చర్చించుకున్నాం: ప్రధాని మోదీ

Modi Talks With Biden in Phone
  • బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
  • న్యాయబద్ధ పాలనకు కట్టుబడాలని నిర్ణయం
  • ట్విట్టర్ లో వెల్లడించిన భారత ప్రధాని
అమెరికా అధ్యక్షుడిగా గత నెలలో బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీయే నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా బైడెన్ ‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాము ఇరువురమూ పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చించుకున్నామని మోదీ తెలియజేశారు.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇద్దరమూ నిర్ణయించుకున్నామని తెలిపారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరులో సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించామన్నారు.

"అధ్యక్షుడు బైడెన్, నేను న్యాయబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. వ్యూహాత్మక  భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం" అని మోదీ ట్వీట్‌ చేశారు.

అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగానే, మోదీ, తన ట్వీట్ల ద్వారా అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా, తొలిసారి ఇరు దేశల నేతలూ ఫోన్ లో మాట్లాడుకుని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Narendra Modi
Joe Biden
Twitter
Phone Call

More Telugu News