ప్రియురాలి మోజులో భార్యను చంపాడు... అటు ప్రియురాలు కూడా మృతి!

Man kills wife in Khammam district
  • ఖమ్మం జిల్లాలో దారుణం
  • పెళ్లయిన రెండు నెలలకే భార్య హత్య
  • మెడకు చున్నీ బిగించి అంతమొందించిన వైనం
  • సీసీ కెమెరా ఫుటేజితో దొరికిపోయిన భర్త
పెళ్లయిన రెండు నెలలకే భార్యను చంపాడో కిరాతకుడు. ప్రియురాలి వ్యామోహంలో ఘాతుకానికి పాల్పడిన ఆ యువకుడు... చివరికి ప్రియురాలిని కూడా కోల్పోయాడు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నవ్యరెడ్డి బీటెక్ సెకండియర్ విద్యార్థిని. ఆమెకు తన మేనమామ కుమారుడు నాగశేషుతో ఇటీవలే వివాహం జరిగింది. నాగశేషుది కూడా ఆదే ఊరు. పైగా బంధువు కూడా. స్వయానా మేనమామ కొడుకు. నాగశేషు పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. బంధుమిత్రుల సందడి నడుమ వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు.

కాగా, ఫిబ్రవరి 3న నాగశేషు తన భార్య నవ్యను బైక్ పై ఎక్కించుకుని కాలేజీలో డ్రాప్ చేస్తానని బయల్దేరాడు. మార్గమధ్యంలో మత్తుమందు కలిపిన నీళ్లు భార్యతో తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయాక సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. నవ్య సెల్ ఫోన్ నుంచి ఆమె తండ్రికి సందేశం పంపాడు. తాను బ్యాక్ లాగ్ సబ్జెక్టుల కారణంగా చనిపోతున్నానని నవ్య సందేశం పంపినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాడు.

ఈ నేపథ్యంలో నవ్య కనిపించడంలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించగా, ఆమె భర్త నాగశేషు దుర్మార్గం బట్టబయలైంది. దాంతో అతడిని విచారించగా, నవ్యను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. ప్రియురాలి కోసమే ఈ హత్య చేసినట్టు తెలిసింది. మరోపక్క, అటు, నాగశేషు ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆమె రైలు కింద పడి చనిపోయినట్టు వెల్లడైంది.
Go Back to Shorts
Nagaseshu
Navya Reddy
Murder
Police
Khammam District

More Telugu News